సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్
న్యాయశాఖకు సీజేఐ గవాయ్ సిఫారసు

ఢిల్లీ, అక్టోబర్ 27: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (%జజీI%)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి సీజేఐ బాధ్యతలు చేపట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న పద్ధతికి అనుగుణంగానే ఈ సిఫార్సు జరిగింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, జస్టిస్ సూర్యకాంత్ను భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫార్సు చేస్తూ గవాయ్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ సిఫార్సు ఆమోదం పొందిన తర్వాత, జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24, 2025న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఫిబ్రవరి 9, 2027 వరకు, అంటే సుమారు 14 నెలలకు పైగా ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్ మే 24, 2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. హర్యానాకి చెందిన జస్టిస్ సూర్యకాంత్.. ఫిబ్రవరి 10, 1962న హిసార్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1981లో ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి పట్టభద్రుడై, 1984లో రోప్ాతక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 1984లోనే హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి, మార్చి 2001లో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. అనంతరం జనవరి 9, 2004న పంజాబ్ హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఆ తర్వాత అక్టోబర్ 5, 2018 నుండి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కాంత్, 2019 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2020) వంటి అనేక ముఖ్యమైన తీర్పులు వెలువరించారు. ఈ కేసులో జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఒక ప్రాథమిక హక్కు అని ఆయన ధర్మాసనం పేర్కొంది. సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేసే అనేక సున్నితమైన కేసులలో జస్టిస్ సూర్యకాంత్ తీర్పులు ఇచ్చారు. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) వంటి పర్యావరణ సంబంధిత కేసులలో ఆయన కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలను సమర్థించారు. మహిళా హక్కులు, లింగ సమానత్వం, ప్రైవసీ హక్కు వంటి అంశాలపై ఆయన వెలువరించిన తీర్పులు న్యాయ చరిత్రలో కీలకంగా నిలిచాయి.
