సీక్రెట్ వీడియోలే కొంప ముంచాయి
ప్రియుడిని చంపించి, యాక్సిడెంట్గా చిత్రీకరించిన లివ్-ఇన్ పార్టనర్

ఢిల్లీ , అక్టోబర్ 27: ఢిల్లీకి చెందిన యూపీఎస్సీ అభ్యర్థి రమేష్ కేశ్ మీనా (32) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట అగ్నిప్రమాదం (ఫైర్ యాక్సిడెంట్)గా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలింది. రమేష్ తన వద్ద ఉన్న ప్రైవేట్ వీడియోల కోసమే, ప్రియురాలు పక్కా ప్లాన్తో ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు వెల్లడిరచారు. తిమార్పూర్లోని గాంధీ విహార్కు చెందిన రమేష్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. కొన్ని నెలల క్రితం అతడికి 21 ఏళ్ల అమ్రితతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ గాంధీ విహార్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం మొదలుపెట్టారు. ఈ క్రమంలో, రమేష్ ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సీక్రెట్గా వీడియోలు తీసి, హార్డ్ డిస్క్లో దాచిపెట్టాడు

ఈ విషయం అమ్రితకు తెలియడంతో, ఆమె రమేష్ను నిలదీసి, ఆ వీడియోలను తొలగించాలని కోరింది. అయితే, రమేష్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అమ్రిత, ఈ సమస్యను తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్కు చెప్పింది. వీడియోల విషయంలో రమేష్ బెదిరింపులకు పాల్పడుతుండటంతో, అమ్రిత, సుమిత్ కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. సుమిత్ తన స్నేహితుడు సందీప్ కుమార్ సహాయం తీసుకున్నాడు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి సుమిత్, సందీప్.. రమేష్ ఫ్లాట్కు వెళ్లి అతడిని కొట్టి, గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు, మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. సుమిత్ గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి రమేష్ తల దగ్గర పెట్టి, సిగరెట్లు కాల్చే లైటర్ను అంటించి డెడ్ బాడీకి కొద్దిదూరంలో ఉంచాడు.
అనంతరం రమేష్కు సంబంధించిన రెండు ల్యాప్ట్యాప్లు, హార్డ్ డిస్క్లు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. లీకైన గ్యాస్ వల్ల గంట తర్వాత లైటర్ అంటుకుని బ్లాస్ట్ జరగడంతో ఇల్లు మొత్తం కాలిపోయింది. మొదట పోలీసులు దీనిని అగ్నిప్రమాదంగా భావించినా, రమేష్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 18న అమ్రితను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మిగిలిన ఇద్దరు నిందితులు సుమిత్, సందీప్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
